Monday, July 27, 2009

కలదుకలందనేది కలదోలేదో

నిత్య కాన్స్టిపేషన్ మొహంతో వుండి యెప్పుడూ రెందు వేళ్ళు చూపిస్తూ వుండేవాడొకడూ , మహామూర్ఖుడిలాగా నిరంతరం పిచ్చినవ్వులు నవ్వుతూ వుండేవాడింకొకడూ వీళ్ళ వెనక కేతిగాళ్ళూ వీళ్ళు మన ప్రజాస్వామ్యానికి కాపలాదార్లా ?వీళ్ళమొహానికి ఛాలెంజిలొకటా?మాట్లాడితే సిట్టింగుజడ్జిలూ ఎలెక్షన్ కమిషనూ...అత్యంత ప్రతిభావంతులైన ఆఫీసరులూ న్యాయమూర్తులూ పోలీసులూ యెంతకష్టపడి ఇన్ని పరీక్షలు రాసి ఇంటర్వ్యూలెదుర్కుని ఆ స్థానానికి వచ్చేరు? ఈ పిచ్చివెధవల తగువులు తీర్చడానికా? ప్రజాస్వామ్యం మీద నమ్మకముంటే అని అరిచి చస్తున్న ఆ మనిషి నిన్నమొన్న జరిగిన యెన్నికలు యేమనుకుంటున్నాడు? ఆయనకి వోటు పడకపోతే లెక్క లోనికి రావా?మన అదృష్టం కొద్దీ వీళ్ళతో యే అవసరాలూ లేని జే పీ చిరంజీవీ అక్కడ వుండి కొంచెం సేనిటీ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజల సొమ్ము పాడు చేస్తున్నందుకు నాయుదుకీ రెడ్డికీ జీవితఖైదు విధించే నాధుడు లేడా?

Tuesday, July 21, 2009

నీతా? అంటే యేమిటి?

గత పోస్టు తరువాత రెండు సంగతులు జరిగాయి.ఒకటి యె ఐ సి టి యి అరెస్టులు. హాచ్చెర్యం అరెస్టులు జరగడం...లంచాలు తీసుకోడం కాదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల అన్నట్టు లంచాల సంగతి ఇప్పుడెందుకు? స్వయంగా కొన్ని కమిటీల్లో కాలేజిల అధ్వాన్న స్థితి గమనించీ రిపోర్టిచ్చీ యేమీ కాకపోవడం గమనించిన నా లాటి వాళ్ళకి ఇందులో విశేషమేమీ లేదు.బహుశా ఆకాలేజీల విద్యార్ధులకీ వారి తల్లిదండ్రులకీ కూడా అంతే.యెవరీ బాధిత పార్తీ అన్నదే ప్రశ్న. వాటాలు చాలని వాళ్ళా .. ఇప్పటికే చాలామందికి ఇచ్చిన వాళ్ళా.. తెలిసే అవకాశం లేదు.
ఎం ఎల్ యే రామారావు కేసు రోజు రోజు కీ జుగుప్సాకరంగా తయారవుతోంది.అలాంటి ఆరోపణలు యెదుర్కుంటున్న వ్యక్తిని టీడీపీ యెందుకు వెనకేసుకువస్తోంది? రాజశేఖర రెడ్డిని తూలనాడడానికి యేదైనా వోకేనా? రాజకీయం ప్రవేశించకముందు అన్ని ఛానెళ్ళలోనూ రామారావు నీళ్ళటాంకు దగ్గిర దాక్కోడం ప్రముఖంగా చూపించారే! యేదీ జరక్క పోతే మరి దాక్కున్నదెందుకు?నీతికి కట్టుబడే రాజకీయంలో నిజం తేలే దాకా వేచి వుండడం జరగాలి. నీతా? అదేమిటి?

Wednesday, July 15, 2009

హ హ్హ హ్హ

త్వరలో ప్రజలందరికీ 24 గంటలూ నీళ్ళ సరఫరా అట!మన నగరాలు ప్రపంచ స్థాయికి చేరుతాయి[ట] యెవరిని వేళాకోళం చేస్తున్నారు? తెలుగు ప్రజలు హాస్యప్రియులు కాబట్టి సరిపోయింది.పాతకాలంలో టీవీలో సిట్ కాం లనబడే కామెడీ సీరియళ్ళు వచ్చినప్పుడు వాటిలో లాఫ్ ట్రాక్ ఉండేది.మనం నవ్వాలని గుర్తు చెయ్యడానికి. ఈ రోజుల్లో వార్తలు వచ్చేటప్పుడు లాఫ్ ట్రాక్ పెడితే బాగుంటుంది. ప్రధానమంత్రి ఇలా అన్నారు[హ హ్హ హ్హ] ప్రతిపక్షనేత మేమైతేనా అన్నారు [హ హ్హ హ్హ హ్హ] అలా అన్న మాట. సంఖ్య ఎక్కువైన వార్తా ఛానెళ్ళలో ఎవరైనా ఈ వెరైటీ ట్రై చేస్తారా?

Tuesday, July 14, 2009

దేశం యేమయ్యెట్టు

రాజశేఖరరెడ్డిగారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నెట్ లో కాంపైన్ మొదలైందట! అలనాటి క్లాసిక్ కథానాయకుడు సినిమా లోని నాగభూషణం డైలాగు గుర్తొచ్చింది. అల్లు రామలింగయ్య ధరించిన అప్పడు అనే మునిసిపల్ కౌన్సిలర్ తన శిలా విగ్రహం పెట్టించమని అడిగిన సందర్భంలో దేశం యేమయ్యెట్టు అని తన టిపికల్ స్వరంలో అంటాడు. ఇప్పుడు ప్రపంచం యేమయ్యేట్టు అనాలా!.అన్నీ పురాణాల్లోనే వున్నాయి అన్నట్టు అన్నీ కన్యాశుల్కంలోనే వున్నాయి. అసెంబ్లీ లో బాబు గారు నిప్పులు చెరుగుతున్నప్పుడు రెడ్డి గారి నవ్వు చూస్తే అగ్నిహొత్రావధాన్లు ఉక్రోషంతో ప్లీడర్ని నీ ఇంట కోడి కాల్చా అని శాపనార్ధం పెడితే నెమ్మదిగా 'రోజూ కాలుస్తూనే వుంటారూ అని ఆ నాయుడు అనబడే ప్లీడరు సమాధానం ఇవ్వడం గుర్తొస్తుంది..

Monday, July 13, 2009

నోరా

నన్నపనేని రాజకుమారి గారు మాట తూలి రాళ్ళ వర్షానికి గురయ్యారు. అవతల వాళ్ళు కూడా హద్దుమీరడం తప్పితే ఇదొక వార్తా? మొన్నటికి మొన్న రాజధానిలో రాజకీయాలకి సంబంధంలేని బ్రహ్మానందం సన్మానసభలో నోరుజారి బ్రహ్మానందం చేత చెంపపెట్టులాంటి మాట అనిపించుకున్నారు. నోరా వీపుకి తేకే అన్న నానుడి ఎప్పటికి అర్ధం చేసుకుంటారో. బాధాకరమైన విషయం యేమంటే ఆవిడ అధినేత కూడా ఈ మార్గమే ఉత్తమమని తనూ అనుసరించే సూచనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి.ఆయన చతురతతో జ్ఞానంతో దూరదృష్టితో ఆంధ్ర దేశానికి చేయవలసిన మేలింకా చాలా మిగిలి వుంది.ఆయన నాయకత్వం కోసం జాతి యెదురు చూస్తోంది. పెద్దమనిషి తరహా వదిలేసి ఇలా పక్కదారి పట్టడం శోచనీయం.బాబు గారూ మామీద దయ తలచండి.

వాస్తువంకాయ

చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంలో గేటు తీసేయించి గోడ కట్టిస్తున్నారని వార్తా విశేషం.నిన్న రోజంతా టీవీఛానెళ్ళు ఊదరగొట్టేశాయి.అక్కడ ఉండకూడని దిక్కులో గేటు ఉండడం చాతనే ఆయన దశ బాగాలేదని వాస్తు విజ్ఞానులు నొక్కి వక్కాణించారని ఉవాచ. మరి వారు తొమ్మిది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగినప్పుడు ఆ గేటు అక్కడే ఉన్నట్టుందే?తన రాజకీయ చతురతా వ్యక్తిత్వమూ యేవీ పని చెయ్యవా? తమ పార్టీ విధానాలకన్నా జూనియర్ ఎన్ టీ ఆర్ జనాకర్షణ యెక్కువ ప్రభావం చూపుతుందని కూడా నమ్మారు!ఛానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలు ప్రతి వూరిలోనూ ఒకే పాట కంఠతా పెట్టి పాడిన విషయం కళ్ళకి కట్టించాయి. ఏమిటో!